Tuesday, April 23, 2024

ఏపీ సీఎస్ ను జైలుకు పంపుతాం: ఎన్జీటీ వార్నింగ్

రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామంటూ సీఎస్‌ను హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును అనుమతులు లేకుండా నిర్మిస్తోందని కేంద్ర జల శక్తి శాఖ కార్యదరికి, ఎన్‌జీటీకి, కృష్ణా బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ మంగళవారం(జూన్ 22) లేఖ రాశారు. అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రం, బోర్డు, ఎన్జీటీ సూచించినా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉందని తెలంగాణ ఆరోపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement