Wednesday, April 24, 2024

‘లాఠీల‌తో వ‌స్తారా?.. లారీల‌తో వ‌స్తారో? రండి’: ఏపీ సర్కార్ కు నారా లోకేష్ డెడ్ లైన్

ఏపీలో జగన్ పాలనలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్రమే నడుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అనంతపురంలో ఎయిడెడ్​ పాఠశాలల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ కళాశాల భూములపై సీఎం జగన్‌ కన్నేశారని ఆరోపించారు. ఎయిడెడ్‌ కళాశాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారని నారా లోకేశ్ వివరించారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మొదలు జగన్ తండ్రి వైఎస్ఆర్ వరకు  ఎంతో మంది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని రెండు వేలకు పైగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో రెండు లక్షల మంది, 182 జూనియర్ కళాశాలల్లో 71 వేల మంది విద్యార్థులున్నారని వివరించారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు. ఎయిడెడ్ సంస్థ‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మంది నిరుపేద విద్యార్థులేనని అన్నారు. ల‌క్ష‌లాది పిల్ల‌ల చ‌దువు కంటే ఎయిడెడ్ సంస్థలకు వున్న‌ లక్ష కోట్ల విలువైన భూములు, ఆస్తులే జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్యం అయ్యాయని ఆరోపించారు. ఎయిడెడ్ సంస్థ‌ల క‌ళాశాల‌ల్లో ప‌నిచేసే లెక్చ‌ర‌ర్ల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌డంతో అప్ప‌టి వ‌ర‌కూ ప‌నిచేసే 750 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను త‌మ ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేస్తానని చెప్పిన హామీని ఇచ్చిన జ‌గ‌న్‌…చివ‌రికి వారికి ఉద్యోగ‌మే లేకుండా చేశాడని ధ్వజమెత్తారు.

కేవ‌లం ఎయిడెడ్ సంస్థ‌ల ఆస్తులు చేజిక్కించుకోవ‌డానికి విద్యార్థులు, కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌ను న‌డిరోడ్డున ప‌డేశారని నిప్పులు చెరిగారు. అనంతపురం ఎస్ఎస్‌బీఎన్ క‌ళాశాలే కాదు..రాష్ట్రంలో ఏ ఒక్క ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటు కానివ్వమని స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్య‌మానికి తెలుగుదేశం పార్టీ ముందుండి న‌డిపిస్తుందన్నారు. లాఠీల‌తో వ‌స్తారో…లారీల‌తో వ‌స్తారో రానివ్వండి వ్యాఖ్యానించారు. కాలేజీల‌ను కాపాడుకుంటామని, స్కూళ్ల‌ను ర‌క్షించుకుంటామని స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగేవ‌ర‌కూ టీడీపీ ఉద్యమం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. జ‌గ‌న్ విధ్వంస‌పాల‌న‌కి చ‌ర‌మ‌గీతం పాడేవ‌ర‌కూ తెలుగుదేశం పోరాడతుందన్నారు. జగన్ రెడ్డికి వారం రోజులు డెడ్ లైన్ పెడుతున్నానని తెలిపారు. విద్యార్థుల పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న లోకేష్.. ఆదేశాలు జారీ చేసిన వారి పేర్లు బయట పెట్టేలా దర్యాప్తు చెయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై కేసులు వెంటనే ఎత్తేవెయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి ఇచ్చిన చెత్త జిఓలు రద్దు చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Breaking: పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్!

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement