Saturday, April 20, 2024

కరోనా మూడో దశ… పరీక్షలు వద్దు: లోకేష్

పది, ఇంటర్ పరీక్షల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘’ ప‌రీక్ష‌లు జూలైలో నిర్వ‌హిస్తామంటోన్న మ‌తిలేని సీఎం వైఎస్ జగన్ గారూ!! అదే నెల‌లో కోవిడ్‌ థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల పాలిట ప్రాణాంత‌క‌మ‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రించేది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి. ముందుచూపులేని మంద‌బుద్ధి ముఖ్య‌మంత్రీ అక్టోబ‌ర్‌లో ప్ర‌వేశాలు నిర్వ‌హించి విద్యాసంవ‌త్స‌రాన్ని 4 నెల‌ల‌కు కుదించ‌డం విద్యార్థుల భ‌విష్య‌త్తుతో చెల‌గాట‌మే. ముందుచూపులేని ముఖ్య‌మంత్రీ.. మీ తుగ్ల‌క్ నిర్ణ‌యాల‌తో ప‌రీక్ష‌ల పేరుతో విద్యార్థులు, టీచ‌ర్ల‌ను బ‌లి చేయొద్దు. వెంట‌నే టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దుచేసి విద్యార్థుల్ని పాస్ చేయండి ’’ అంటూ నారా లోకేష్‌ డిమాండ్ చేశారు.

పరీక్షల విషయంలో గతేడాది చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ఏడాది కూడా ఇలాగే రెండు స్లార్ పరీక్షలు వాయిదా వేసి చివరకు రద్దు చేశారని గుర్తు చేశారు. ఈ ఏడు కూడా అదే తప్పు చేస్తున్నారని,  చుట్టూ ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఎంతో ఒత్తడిలో ఉంటారని అన్నారు. పరీక్షల విషయంలో ఎందుకీ ముర్ఖత్వం? అని ప్రశ్నించారు. 18-45 వయసు గల వారికి సెప్టెంబర్ దాకా వ్యాక్సిన్లు ఇవ్వలేమని అన్నారని, అప్పటికి పిల్లల్లో థర్డ్ వేవ్ వస్తుందని లోకేష్‌ తెలిపారు. క్యాబినెట్ సమావేశం నిర్వహించలేని ప్రభుత్వం.. పిల్లలకు పరీక్షలు పెట్టి రిస్క్ లో పడేస్తారా ? అని నిలదీశారు.కరోనా మూడో దశ ప్రభావం పిల్లలపైనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, అయినప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ సహా 14 రాష్ట్రాలు 10, 11 తరగతి పరీక్షలను రద్దు చేశాయని, ఏపీలోనూ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

జూలైనలో పరీక్షలు పెడితే, పేపర్లు దిద్దటానికి 45 రోజుల పడుతుందన్నారు. రీవాల్యుయేషన్, అడ్మిషన్లు అయ్యే సరికి అక్టోబర్ అవుతుందన్నారు. జూన్ లో ప్రారంభం కావాల్సిన అకాడమిక్ ఇయర్, అక్టోబర్ లో ప్రారంభించి 4 నెలల్లో ముగిస్తారా? అని ప్రశ్నించారు. గత ఏడాది ముందుచూపులేక ఇవే తప్పులు చేశారని లోకేష్‌ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement