Saturday, March 16, 2024

ఏపీలో ఆస్పత్రుల నిర్మాణానికి నాబార్డ్ రుణం.. 1,392.23 కోట్లు మంజూరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) రూ.1392.23 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. వైఎస్ఆర్ కడప, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ళ్ల‌ను నిర్మించేందుకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త సంస్థల్లో ప్రధానంగా ఆపరేషన్ థియేటర్లు, క్లినికల్ ఔట్ పేషెంట్ విభాగాలు, డయాలసిస్, బర్న్ వార్డులు, క్యాజువాలిటీ వార్డులు, ప్రత్యేకమైన క్లినికల్-కమ్-సర్జికల్ వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులను వినియోగించాల్సి ఉంటుంది.

ఇక‌.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ గదులు, ఆయుష్ క్లినిక్, ట్రీట్‌మెంట్ ప్రొసీజర్ రూమ్‌లు, డయాలసిస్ వార్డులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఓపీడీ, సాధారణ / పీడియాట్రిక్ / ఆర్థోపెడిక్ వార్డులు మొదలైనవి ఏర్పాటు చేయాలి. గో-ఏపీ ఫ్లాగ్‌షిప్, నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాల ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రూ.3,092 కోట్లు నాబార్డ్ రుణం మంజూరైన సంగతి తెలిసిందే. ఈ నిధులతో 25,648 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మరుగుదొడ్లు, తాగునీరు తదితరి సదుపాయాలు కల్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement