Friday, March 29, 2024

ఏపీలో పరీక్షల నిర్వహణపై ప్రధాని మోదీకి RRR లేఖ

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు ప్రధాని మోదీకి ఈ అంశంపై లేఖ రాశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను విద్యార్థి లోకం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనిపై ఏపీలో ఒకింత అధిక ఆందోళన నెలకొని ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రఘురామకృష్ణరాజు.

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే లక్షల్లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైరస్ బారినపడే అవకాశాలున్నాయని, వారు వ్యాప్తికి కారకులు కావడమో, లేక వారే బలికావడమో జరుగుతుందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారుకు ఇదేమీ కనిపిస్తున్నట్టుగా లేదని, అందుకే ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ప్రధాని గారూ కరోనా కట్టడికి మీరు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మీరు జోక్యం చేసుకుని తీరాల్సిన అత్యంత కీలక సమయం ఇదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement