Saturday, April 20, 2024

నా హత్యకు కుట్ర: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ

తన హత్యకు కుట్ర జరుగుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్యపైనా రఘురామ స్పందించారు. చంద్రయ్యను ఎంతో దారుణంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. వ్యవస్థ నచ్చకపోయినా, వ్యక్తి నచ్చకపోయినా సీఎం జగన్ తీసేస్తుంటారని పేర్కొన్నారు.

సినీ నటుడు చిరంజీవిని వైసీపీ తరుపున రాజ్యసభకు పంపుతున్నారంటూ ఓ ఆంగ్ల ప్రత్రికలో కథనం వచ్చిందని రఘురామ తెలిపారు. అయితే, రాజ్యసభ పదవి కోసం చిరంజీవి వైసీపీలో చేరతారని భావించడంలేదని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే పని చిరంజీవి చేయడని చెప్పారు.
సంక్రాంతి సందర్భంగా సొంత నియోజకవర్గం నరసాపురం వెళ్లాలని రఘురామ భావించారు. అయితే సీఐడీ నోటీసుల నేపథ్యంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అంతేకాదు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.

కాగా, కొద్ది రోజుల క్రితం విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంపై పోలీసులు విచారణ కూడా జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా రఘురామకృష్ణ రాజు కూడా తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలనమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement