Thursday, April 18, 2024

చంద్రగిరిలో ఆనందయ్య మందు.. ప్రజలకు ఉచితం పంపిణీ

కరోనా మహమ్మారిపై పోరాటం లో భాగంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆనందయ్య ఔషదం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో చంద్రగిరి ప్రజలకు చేరువ కానుంది. ఇందుకు ఆనందయ్య మందు తయారీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ తీసుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ అనుమతులు వచ్చిన నాటి నుంచి సహజ సిద్ధ వనమూలికల సేకరణ ప్రక్రియను చేపట్టారు. సాంప్రదాయ మందు తయారీలో ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్య బృందం సహకారం తీసుకున్నారు. మందు తయారీలో కూడా కట్టెల పొయ్యి, రాగి బాండలి వంటి సాంప్రదాయ పద్దతుల్లో చేపట్టారు. ఆదివారం ఆనందయ్య మందు తయారీ విధానాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్(పి) ను మాత్రమే తయారు చేస్తున్నట్లు తెలిపారు. నా నియోజక వర్గంలో 1.60 లక్షల కుటుంబాలకు 5.20 లక్షల మంది ప్రజలకు ఉచితంగా అనందయ్య మందును అందించనున్నట్లు స్పష్టం చేశారు. సహజసిద్ధమైన 16 వనమూలికలతో ఆనందయ్య మందు తయారీ కి శ్రీకారం చుట్టామన్నారు.

ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, నేరేడు, మామిడి, నేల ఉసిరి, పిప్పింట, బుడ్డ బుడవ ఆకులు, కొండ పల్లేరు కాయలు, తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చారన్నారు. ప్రజల  సహకారం మరువలేనిదన్నారు. రెండు రోజుల్లో నియోజకవర్గ పరిధిలో 142 గ్రామ పంచాయతీలు, దాదాపు 1600 గ్రామాలలో ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆనందయ్య మందు తయారీ లో సహకారం అందించిన వారిలో ఆయన శిష్య బృందం చంద్రకుమార్, సురేష్, వంశీ కృష్ణలు ఉన్నారు. కరోనా కట్టడికి ఉపయుక్తమైన సాంప్రదాయ మందు తయారీ లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ అభినందన నీయం.. అని ఆనందయ్య తనయుడు శ్రీధర్ అన్నారు. వనమూలికల సేకరణ యజ్ఞం లా చేపట్టారన్నారు. రాష్ట్రంలో ప్రజల కోసం చెవిరెడ్డిలా సాహసోపేతంగా ఆలోచన చేయచేసిన నాయకులు లేరన్నారు. చెవిరెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదర్శనీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement