Thursday, April 25, 2024

టిటిడి ఈవోపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు గరం గరం – వీడియోతో..

“నీ వాళ్ళకు, నీ చుట్టాలకు ఒక చట్టం.. ఇతరులకో చట్టమా..?” -టీటీడీ మీ ఎస్టేట్ అనుకున్నారా..? -సిఎంవో సిఫారసును కాదంటారా..? -ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా.. -టీటీడీ ఈఓ ఒంటెత్తు పోకడపై గిద్దలూరు ఎమ్యెల్యే అన్నా రాంబాబు తీవ్ర స్థాయి మండిపాటు

గిద్దలూరు:మార్చి26(ప్రభ న్యూస్) తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలు, సౌకర్యాల కల్పనలో ప్రోటోకాల్ ప్రక్రియను టిటిడి ఈఓ ,ఇతర అధికారులు దుర్వినియోగం చేస్తున్నారంటూ గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు.. ఒంటెత్తు పోకడతో,తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇటు టిటిడికి,అటు ప్రభుత్వ పెద్దలకు చెడ్డ పేరు తెచ్చేందుకు పని చేస్తున్నారని టిటిడి ఈఓ ధర్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన తిరుమలలో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సౌకర్యాలు చేపడ్తున్నామనే వంకతో ప్రోటోకాల్ విషయంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు.సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడాన్ని తాము స్వాగతిస్తామన్నారు. ఏ నిబంధననైనా, ఏ కార్యక్రమమైనా తిరుమలలో పారదర్శకంగా జరిగితే సంతోషిస్తాం..స్వాగతిస్తామన్నారు. కానీ తిరుమలలో అలా జరగటం లేదన్నారు.
ప్రోటోకాల్ దర్శనాలు, సౌకర్యాల విషయంలో ఈఓ తన వారిని ఒక రకంగా,ఇతరులను ఇంకో రకంగా,అవమానకరంగా చూడటమేమిటని నిలదీశారు.

దీన్ని ఏమంటారు..? ఇది వివక్ష చూపడం కాదా..?
ఎ.పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జారీ అయిన సిఫారసును జనరల్ కేటగిరీలో వేయడమేమిటని సూటిగా ప్రశ్నించారు.
తన ఎదుట,తన సమక్షంలో ప్రోటోకాల్ లో ఉన్నవారి వాహనాలను వదిలేసి, అదే ప్రోటోకాల్ లో ఉన్న తమ వాహనాలను ఆపి సోదా చేయడమేమిటన్నారు. ‘ఆదివారం ప్రోటోకాల్ లో వచ్చిన 350 మంది ఎమ్యెల్యేలు,ఎంపీ లు,మంత్రులేనా..? ఈ ఓ గారు’
అని రాంబాబు ప్రశ్నించారు. ఈఓ తన చుట్టాలకు, తనకు కావాల్సిన వారికి, తనకు కావాల్సిన ఎమ్యెల్యే లకు తన ఇష్ట మొచ్చిన మర్యాదలు చేసి, ఇతరులను,ఇతర ఎమ్యెల్యేలను అగౌరవ పరుస్తారా..? సామాన్య భక్తుల బూచిని చూపి ఆ ముసుగులో ఈఓ చేస్తున్నదేమిటి..? అని ప్రశ్నించారు.సామాన్య భక్తుల కోసం ఏమి చేసినా స్వాగతిస్తాం.. కానీ ఈ. ఓ గా మీరు చేస్తున్నదేమిటి..? అని నిలదీశారు. టిటిడి ఈఓ ఒంటెత్తు పోకడపై,ఆయన వైఖరిపై ముఖ్యమంత్రి దృష్టికి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్తాన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement