Thursday, April 25, 2024

క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ – పండుగ‌లు జ‌రుపుకోండి – మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, ప్రభ న్యూస్ : రాష్ట్ర ప్రజలంతా ‘భోగి’ భోగభాగ్యాలతో ‘సంక్రాంతి’ సంపదలతో, ‘కనుమ’ కనువిందుగా జరుపుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన కార్యాలయం నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలుగు వారి అతి ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటని మంత్రి అన్నారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఊరు కొత్త సందడిని సంతరించుకుంటుందన్నారు.

ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు.. మళ్ళీ తమ స్వంత ప్రాంతాలకు చేరుకుంటారన్నారు. ఇంటికి చేరిన ధాన్యపు సిరులు, ఇంటి ముందు రంగవల్లులు, వాటి మధ్యలో గోబ్బెమ్మలు, హరిదాసుల ఆలాపనలు, ముంగిట నిలిచిన బసవన్నలు, పిండి వంటలు, గాలి పటాలు, చిన్న పిల్లల కేరింతలు, కొత్త అల్లుళ్ళ కొంటెతనాలు, పందేల రాయుళ్ళ ఆర్భాటాలతో సంక్రాంతో శోభ వెల్లివిరుస్తుందన్నారు. భోగి – సంక్రాంతి – కనుమ మూడు పర్వ దినాలు అందించే జ్ఞాపకాలు సంవత్సరానికి సరిపడా మిగులుతాయన్నారు. ఇంతటి గొప్ప పర్వదినాలలో కరోనా మహమ్మారి మూడవ దశ సంతరించుకొని ఒమీక్రాన్ రూపంలో వేగంగా వ్యాపిస్తున్న విషయం మరువరాద‌ని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement