Thursday, April 25, 2024

టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా?: నానికి మంత్రి బొత్స కౌంటర్

ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడంపై సినీ హీరో నాని బహిరంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రమోషన్ లో నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్‌ ధరలు తగ్గించామని మంత్రి బొత్స తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలన్నారు. తమకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. ప్రేక్షకులను తామెందుకు అవమానిస్తామని, టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా ? అని మంత్రి ప్రశ్నించారు. మేమింతే.. ఎంతంటే అంత వసూలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. సినిమా చూసే వారికి మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స చెప్పారు.

కాగా, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో నాని ప్రభుత్వ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని నాని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement