Thursday, April 25, 2024

నువ్వు గడ్డం పెంచగానే ఏదో జరగదు: లోకేష్ పై మంత్రి అనిల్ ఫైర్

పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో టీడీపీ చేసిన తప్పులను తాము చేయమని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయని, ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి అయితే సీఎం జగన్, దివంగత్ సీఎం వైఎస్సార్‌కి మంచి పేరు వస్తుందని టీడీపీకి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి అనిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చినబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కి వెళుతోందని అన్నారు. మూడు శాఖలకు మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని విమర్శించారు. ఉన్న ఎమ్మెల్సీ కూడా ఓ ఏడాదిలో పూర్తి అయిపోతుంది. అందుకే బయట తిరగలేక ఇంట్లో కూర్చుని జూమ్‌లో సీఎం జగన్ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు ఒక్క శాతమైనా ఉందా అని మంత్రి అనిల్ ప్రశ్నించారు.

‘’మా తాత సీఎం, మా నాన్న సీఎం అని చెప్పుకున్నా నువ్వు గెలవలేక పోయావ్. కనుచూపు మేరలో నీ పార్టీ జగన్ సంక్షేమ పథకాలతో కొట్టుకుపోయే పరిస్థితి. జగన్ అముల్ బేబీ అయితే.. నువ్వు హెరిటేజ్ దున్నపోతువా. మాటలు నీకే కాదు…మాకు వచ్చు. గూగుల్‌లో కొడితే నీ పేరు పప్పు అని వచ్చింది. నువ్వు గడ్డం పెంచగానే ఏదో జరగదు. ధైర్యం బై బర్త్ బ్లడ్‌లో ఉండాలి. ఆత్మగౌరవం లేకనే మీ నాన్న హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడు. ఏ మాత్రం ఆంధ్ర ప్రజలపై ప్రేమ ఉన్నా గత ఐదేళ్లలో ఏపీలో ఇల్లు కట్టుకునే వాడు. పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. 2022 ఖరీఫ్ నాటికీ తప్పనిసరిగా సాగునీరు అందిస్తాం. స్పిల్ వే పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్ ఎలా కడతారు. వీళ్ళు చేసిన తప్పులను మాపై రుద్దాలని చూస్తున్నారు. సీఎం జగన్‌ పోలవరం కోసం రావాల్సిన నిధుల విషయంపై ఢిల్లీలో చర్చిస్తారు’’ అని మంత్రి అనిల్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: వివేకా హత్య కేసు.. కీలక సమాచారం సేకరించిన సీబీఐ

Advertisement

తాజా వార్తలు

Advertisement