Friday, April 19, 2024

ఆత్మకూరు ఉపఎన్నికపై వైసీపీ గురి.. బరిలో మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి?

దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి తర్వలో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారనే దానిపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మేకపాటి గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గౌతంరెడ్డి మృతితో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో శ్రీకీర్తిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, మేకపాటి కుటుంబం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. 

మరోవైపు వైసీపీ కనుక శ్రీకీర్తిని బరిలోకి దింపితే తాము కొనసాగిస్తున్న సంప్రదాయం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది. వ్యక్తుల మృతితో ఖాళీ అయిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంది. ఆత్మకూరు విషయంలోనూ అదే పాటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉప ఎన్నికను ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement