అమరావతి, ఆంధ్రప్రభ : మహిళలు, యువతులు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అనైతికత చోటు చేసుకుంటున్న క్రమంలో వరసలు కూడా మరిచి కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాళ్ళు తమ లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. ఈక్రమంలో ఎంతోమంది బలవుతున్నారు. ఈక్రమంలోనే కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ కీచకుడు మహిళతో సహజీవనం చేస్తూనే ఆమె కుమార్తెపై కన్నేశాడు. పది నెలలుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటు-చేసుకుంది.
సురేష్ అనే ట్యాక్సీడ్రైవర్ గత కొంతకాలంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈక్రమంలో ఆమె కుమార్తెపై కూడా కన్నేశాడు. తండ్రి స్ధానంలో ఉన్న కామాంధుడు ఆ విషయం మరిచిపోయి పది నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ తల్లికి అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చడంతో జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు. చేసేదేమీ లేక బాలికను ఆస్పత్రిలో చేర్పించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సురేశ్ను అరెస్ట్ చేశారు.