Wednesday, April 24, 2024

జగన్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం : చంద్ర‌బాబు

జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించార‌ని మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యకర్తల మీటింగ్ కు వేలాదిగా తరలివచ్చిన క్యాడర్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ…. రాష్ట్రంలో ప్రతి ఇంటికి జగన్ బాదుడే బాదుడు రీచ్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో వైసిపి కార్యకర్తలతో సహా అంతా బాదుడే బాదుడు బాధితులుగా వ్యాఖ్యానించారు. కర్నూలు మీటింగ్ చూస్తుంటే మహానాడును తలపించే విధంగా ఉందన్నారు. టీడీపీని కాలగర్భంలో కలపాలి అనుకున్న వారే కనుమరుగు అయ్యారన్నారు. రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన ఉందన్నారు. ఒకవైపు విధ్వంసం…మరోవైపు బాదుడు…ఇంకో వైపు అప్పులు.. కుప్పలుగా ఉన్నాయన్నారు. టీడీపీ ముందు జగన్ ఒక బచ్చా…..వైసిపి తాటాకుచప్పుళ్లకు టీడీపీకి భయపడ‌ద‌న్నారు. కర్నూలులో టీడీపీ జెండాలు ఎందుకు తొలగించారు… కడప ఎయిర్పోర్ట్ లోకి కార్యకర్తలను ఎందుకు అనుమతించలేదనీ ప్రశ్నించారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి అచ్చెన్నాయుడు వరకు అందరినీ కేసులతో వేధించారన్నారు. బీసీ జనార్థన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టినా కుంగిపోలేదన్నారు. పోరాడిన విషయం గుర్తు చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రశ్నే లేదన్నారు. కార్యకర్తలపై కేసులు పెడితే నేను చూసుకుంటా…భయపడాల్సిన పని లేదన్నారు.తప్పుడు లెక్కలకు సీబీఐకి అడ్డంగా దొరికిన జగన్ తనపై మాట్లాడుతాడా అన్నారు. ప్రజలకు పాలనపై ఫ్రస్టేషన్ ఉందన్నారు. వైఎస్ చనిపోతే 5 ఏళ్లు ఓదార్పు చేసిన జగన్… నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ సలాం కుటుంబాన్ని గెస్ట్ హౌస్ కు పిలిపించి అవమానిస్తారా అని ప్రశ్నించారు. కార్యకర్తలకు ఏదైనా జరిగితే నా ప్రాణం పెట్టి కాపాడుకుంటాన‌న్నారు. తెలుగు దేశం రాష్ట్రంలో ఇప్పుడు అందరికీ ఒక ఆశగా కనిపిస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పెట్రో, లిక్కర్ ధర ఎంత…మన రాష్ట్రంలో ఎంత అని ప్రశ్నించారు. జ‌గన్ తెచ్చిన మద్యం బ్రాండ్స్ దేశంలో మరెక్కడా లేవన్నారు. జె బ్రాండ్స్ తయారు చేసేది జగనే….అమ్మేది ఆయనే.. . కమిషన్ అయనదే అన్నారు. ఇసుక కొరత ఎందుకు వచ్చింది….రోజుకు ఇద్దరు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి ఎప్పుడూ సిద్దమన్నారు.
22 మంది ఎంపిలను గెలిపించారు…మరి జగన్ ప్రత్యేక హోదా తెచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రాజ్యసభ సీట్లను అమ్ముకున్నాడు…ఎ2ను సరిగా చూసుకోకపోతే…ఎ1 ఔట్ అన్నారు. ఆ భయంతోనే ఎ2కు జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. కేసులు వాదించేవారికి రాజ్యసభ…ముంబాయి లాబీయింగ్ చేసే వారికి రాజ్యసభ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో మూడేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదన్నారు. ఏ.ఒక్కరికి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవన్నారు. కర్నూలును ఇండస్ట్రీ హబ్ చెయ్యాలని కంపెనీలను తెచ్చానన్నారు. గుండ్రేవుల, వేదావతి, ఆర్డిఎస్ ప్రాజెక్టులు ఏమయ్యాయ‌ని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదన్నారు. గడప గడపలో నేతలను జనం ప్రశ్నిస్తుంటే…ఇప్పుడు వైసీపీ బస్సు యాత్ర పట్టిందన్నారు. భవిష్యత్ లో ఇక గాలి యాత్ర చేపట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement