Friday, April 26, 2024

తిరువూరుకు 168 కోట్లతో కృష్ణాజలాలు: ఎమ్మెల్యే రక్షణ నిధి

తిరువూరు నియోజకవర్గానికి రూ. 168 కోట్లతో కృష్ణాజలాలను అందించనున్నట్లు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పేర్కొన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుండి తిరువూరు వరకు పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పంపింగ్ స్కీం పనులను అధికారులు,  ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అలానే మండలంలోని దీప్లా నగరం తండా సమీపంలోని గట్టుపై ఏర్పాటు చేయనున్న వాటర్ స్టోరేజ్ సంపు స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ మండలంలోని గిరిజన తండాల్లోని గిరిజనులు ఫ్లోరైడ్ కలిసి ఉన్న నీటిని త్రాగి ఎక్కువ శాతం మంది కిడ్నీ వ్యాధి బారిన పడి అనేక మంది మృత్యువాత పడ్డారన్నారు. తండా గ్రామాల్లో కిడ్నీ వ్యాధి నివారణకు తిరువూరు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. మండలంలోని తండా వాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృష్ణా జలాలను సరఫరా చేయటానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామానికి కృష్ణాజలాలను అందించి ప్రజల దాహార్తిని తీర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి భూక్యా గనియా, ఎంపీపీ కాలసాని  నాగలక్ష్మి, వైస్ ఎంపీపీ గుంటక  శివారెడ్డి, సర్పంచ్ పర్వతనేని నాగమల్లేశ్వరి చంద్రమోహన్, ఎంపీటీసీ బి. వెంకటేష్ నాయక్, చిమటా రామకృష్ణ, కౌన్సిలర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement