Saturday, April 20, 2024

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో విలేకరులతో మాట్లాడుతూ, సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పై కప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారని శుద్ది అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని వివరించారు. స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమయిందన్నారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, మారుతీప్రసాద్‌, మధుసూదన్‌ యాదవ్‌, విజివో బాలిరెడ్డి, పేష్కార్‌ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆతరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement