Friday, April 19, 2024

Tirumala: సెప్టెంబ‌రు 20న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమల (ప్రభన్యూస్​): తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌రు 20వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఈ కార‌ణంగా ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఇవ్వాల (బుధవారం) తెలిపింది. ఇందుకోసం సెప్టెంబ‌రు 19వ తేదీన సిఫార‌సు లేఖ‌లు స్వీకరించబోమని, భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని అధికారులు తెలిపారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక.. సెప్టెంబ‌రు 20న‌ ఉదయం 6గంటల నుండి ఉదయం 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవ‌ను కూడా టీటీడీ రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement