Thursday, April 25, 2024

వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి మంత్రి కాకాని శుంఖుస్థాప‌న‌

గన్నవరం: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం గన్నవరంలో 46 కోట్లతో ఏర్పాటు చేయ‌నున్న‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వైయస్సార్ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రానికి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ రోజా, ఎమ్మెల్యే వంశీ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ దేశంలో జాతీయ స్థాయిలో వారణాసిలో మాత్రమే జాతీయ విత్తన పరిశోధన కేంద్రం ఉందని, మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సంకల్పించడం రైతు సంక్షేమానికి ఆయనకున్న చిత్తశుద్ధిని సూచిస్తున్నదని అన్నారు. దానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయపరమైన సూచనలు సలహాలు అందిస్తూ వారికి సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్ బి కే లు, అన్ని నియోజకవర్గాలలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు. విత్తనం మంచిదైతే మంచి దిగుబడి వస్తుందని అందువల్ల ప్రధానంగా విత్తనం మీద దృష్టి పెట్టామని అన్నారు. ఆర్ బి కే లలో ఉన్న వ్యవసాయ మత్స్య సహాయకులకు విత్తన పరిశోధనపై తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జన్యుపరమైన, డీఎన్ఏ టెస్టులు కూడా నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఎంతో ప్రయోజనకరమన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశోధన కేంద్రం ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ,రైతు బాగుంటే దేశం బాగుంటుంద‌న్నారు. అన్ని వాతావరణాలను తట్టుకుని మంచి దిగుబదులనిచ్చే విత్తనం రైతులకు అందించాలని రాష్ట్రంలో అతిపెద్ద వైయస్సార్ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రాన్ని 46 కోట్లతో 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతుల సంక్షేమానికి రైతు భరోసా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా వారి ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రి జగనన్నకు రైతులు అండగా ఉండాలని పిలుపు ఇచ్చారు.

గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి శేఖర్ బాబు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జే.రాఘవరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement