Friday, April 19, 2024

అన్నమయ్య కాలిబాట అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు.. కలెక్టర్ ఉత్తర్వులు జారీ

అన్నమయ్య ప్రతినిధి (ప్రభ న్యూస్) : అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ కేంద్రానికి కూత‌వేటు దూరంలో ఉండే తాళ్లపాక అన్నమయ్య ఆస్తులను అక్రమ మార్గంలో కబ్జా చేసేందుకు వేసిన ప్రణాళిక. వికటించింది. ఈ నెల 17న ఆంధ్రప్రభ దినపత్రికలో మెయిన్ పేజీ మొదటి ఎడిషన్లో అన్నమయ్య భూముల హంపట్ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్‌గా దృష్టి సారించింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను ఇనుమడింపజేసిన తాళ్లపాక అన్నమయ్య ఆస్తులను వక్రమార్గంలో కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాలు అందినట్టు సమాచారం. దీనిపై విచారించిన రెవెన్యూ అధికారులు అన్నమయ్య కాలిబాటను అక్రమ మార్గంలో స్వాహా చేసే ప్రయత్నాలు చేశారని నిర్ధారణ అయింది.

రాజంపేట మండలం మన్నూరు రెవెన్యూ గ్రామంలోని అన్నమయ్య కాలిబాట సర్వే నెంబర్ను తారుమారు చేసి స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనుభవ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్టు రాజంపేట రెవిన్యూ అధికారులు నిర్ధారించారు. దీనిపై విచారించిన అధికారులు ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని పరిశోధించారు. ఆ సర్వే నెంబరు పూర్తిగా అన్నమయ్య కాలిబాటకు సంబంధించిందేనని, వీఆర్వో తప్పుడు నివేదిక ఇవ్వడంతో రిజిస్ట్రేషన్లకు అవకాశం లభించిందని తమ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తాళ్లపాక వీఆర్వో ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అన్నమయ్య కాలిబాటకు సంబంధించిన సర్వే నెంబర్లను గుర్తిస్తూ దానిపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాటకు సంబంధించిన విలువైన ఏడు కోట్ల రూపాయల ఆస్తి నీ జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సంరక్షిస్తూ ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజంపేట తాసిల్దార్ ఆ ఉత్తర్వులను రాజంపేట సబ్ రిజిస్టర్ కు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement