Thursday, April 25, 2024

Brahmotsavam: శ్రీవారి స్నపనం కోసం.. జపాన్ ఆపిల్స్, మస్కట్ గ్రేప్స్, కొరియన్ పియర్స్

తిరుమల (ప్రభన్యూస్) : దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో త‌రించిపోతున్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి, అమెరికా నుండి చెర్రీస్ కూడా స్వామివారి సేవకు తెప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్లలోని తమ స్వస్థలాల నుండి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు.

ఇక‌.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేక అలంకరణలు చేసింది. ఒక్క టన్నుసంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మొట్టమొదటిసారిగా, ఫింగర్ మిల్లెట్ (రాగులతో) చేసిన మాల, పచ్చని పవిత్రాలు, పగడపు మాలలతో పాటు స్నపన తిరుమంజనంలో ఏలకులు, వట్టి వేరు, ద్రాక్ష, తులసిదండలు కూడా స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన లిచిస్‌, ఆస్ట్రేలియన్‌ పింక్‌, బ్లాక్‌ గ్రేప్స్‌, వివిధ దేశాలకు చెందిన పండ్లను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించినట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు చెన్నైకి చెందిన నైపుణ్యం గల పుష్ప కళాకారులు ప్రత్యేక అలంకరణలు చేశారు.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పవిత్రోత్సవంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, తిరుమల చిన‌జీయర్ స్వామి, టీటీడీ ఈవో ఎవీ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement