Friday, March 29, 2024

జాల‌ర్ల వ‌ల‌లో.. అరుదైన శ్వేత‌నాగు

చేప‌లు ప‌ట్టే వ‌ల‌లో చిక్కుకుంది శ్వేత‌నాగు. దాంతో స్నేక్ క్యాచ‌ర్ల‌కి స‌మాచారం అందించారు జాల‌ర్లు. వారు అక్కడికి చేరుకుని పామును కాపాడారు. జాలరిపేటలో కనిపించిన ఈ శ్వేతనాగు అరుదైన పాము అని స్నేక్ క్యాచర్ కిరణ్ వెల్ల‌డించారు. ఈ పాము బుస, పడగలతో పాటు విషం కూడా మామూలు పాముల కంటే భిన్నమని వివరించారు. శ్వేతనాగు కాటేస్తే మనిషి క్షణాల్లోనే విగతజీవిగా మారిపోతారని తెలిపారు. సాధారణంగా శ్వేతనాగు మనుషుల కంటపడదని, అరుదుగా ఎక్కడో ఓ చోట కనిపిస్తుందని చెప్పారు. జాలరి పేట కోటవీధి సమీపంలోని మేరీ మాత ఆలయం కొండ ప్రాంతం నుంచి ఈ శ్వేతనాగు జనావాసాల్లోకి వచ్చింది.

ఓ ఇంటి బయట ఉన్న చేపలు పట్టే వలలో ఇరుక్కుపోయి శ్వేతనాగు విలవిలలాడింది. పామును గమనించిన జనం వెంటనే సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నట్లు కిరణ్ చెప్పారు. వలలో నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంతో పాముకు గాయాలయ్యాయని తెలిపారు. దీంతో పామును క్షేమంగా బయటకు తీసి, ప్రథమ చికిత్స చేసినట్లు వివరించారు. సాధారణంగా పాములను పట్టినప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి మనుషులు తిరగని ప్రాంతంలో వదిలిపెడుతుంటానని కిరణ్ పేర్కొన్నారు. ఇది అరుదైన పాము కావడంతో జూలాజికల్ డిపార్ట్ మెంట్ అధికారులను సంప్రదించాకే ఈ శ్వేతనాగును ఏంచేయాలనేది నిర్ణయిస్తామని తెలిపారు.విశాఖపట్నంలోని జాలరిపేటలో ఈ అరుదైన శ్వేతనాగు కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement