Friday, March 29, 2024

నేడు విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అవినాష్‌రెడ్డికి నోటీసులివ్వడం ఇదే మొదటిసారి. అయితే.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతారా..? లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే.. అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. నిన్న అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏ రాఘవరెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గురించి సీబీఐ అధికారులు ఆరా తీశారని తెలుస్తోంది. మరోవైపు.. వివేకా హత్య కేసులో దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. కానీ అవినాష్ రెడ్డి లేఖ‌కు సీబీఐ నుండి ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డంతో వైసీపీ నేత‌ల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం కనిపిస్తోంది. మ‌రో వైపు సీబీఐ బృందం క‌డ‌ప నుండి పులివెందుకు బ‌య‌ల్దేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement