Saturday, March 23, 2024

Big story | అరటి సాగుకు ఉద్యానబోర్డు ఊతం.. 42,500 ఎకరాల ఎంపిక

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు, డాక్టర్‌ వైఎస్సార్‌ జిల్లాల్లోని 42,500 ఎకరాల అరటిసాగును ఇటీవల క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (సీడీపీ) పరిధిలోకి తీసుకువచ్చిన జాతీయ ఉద్యాన బోర్డు ప్రాజెక్టు అమలు కోసం రూ.269.95 కోట్ల కేటాయింపుతో ప్రణాళిక రూపొందించింది. ఈ నిధులను మూడేళ్ల పాటు సీడీపీ కార్యాచరణ, అమలుకు వినియోగించనున్నారు. ప్రాజెక్టు అమలు కోసం కేటాయించిన రూ.269.95 కోట్లలో రూ.100 కోట్లను జాతీయ ఉద్యాన బోర్డు గ్రాంట్‌ రూపంలో అందించనుండగా మిగిలిన నిధులను పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్ట్‌ నర్‌ షిప్‌ (పీపీపీ) కింద సమీకరించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్ల్రోని 12 ప్రాంతాలను సీడీపి అమలుకు ఎంపిక చేయగా అందులో ఏపీలోని మూడు జిల్లాలకు స్థానం దక్కింది.

అరటి సాగుకు అనుకూలమైన నేల స్వభావం, వాతావరణం, నాణ్యత, దిగుబడి తదితర అంశాల ఆధారంగా మూడు జిల్లాల పరిధిలో 42,500 ఎకరాలను ఎంపిక చేశారు. అధికోత్పత్తి, ఎగుమతుల ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టును అమలు చేయనున్నారు. క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (సీడీపీ) పరిధిలో అరటి సాగు చేసే రైతులకు జాతీయ ఉద్యానబోర్డు గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌ సర్టిఫికేషన్‌ ను అందచేయనుంది. జీఏపీ ఉన్న రైతులు ఉత్పత్తి చేసే అరటికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంటు-ంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కూడా అందనున్నాయి. ఒక హెక్టారు అరటి సాగు చేసే రైతుకు ఫ్రూట్‌ కేర్‌ యాక్టివిటీ కింది ప్రభుత్వం సుమారు రూ 40 వేల ఆర్ధికసాయం అందించనుంది.

- Advertisement -

సీడీపీ నిధుల్లో రూ.78.70 కోట్లను లాజిస్టిక్స్‌, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ కోసం వ్యయం చేయనున్నారు. రూ.74.75 కోట్లతో పోస్ట్‌హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, వాల్యూఎడిషన్‌, రూ.116.50 కోట్లతో ప్రీ ప్రొడక్షన్‌ – ప్రొడక్షన్‌ పనులను చేపట్టనున్నారు. రూ.6.5 కోట్ల వ్యయంతో మల్టీమోడల్‌ ట్రాన్స్‌ పోర్టు పరికరాలు, రూరల్‌, డైరెక్ట్‌ మార్కెట్స్‌, కలెక్షన్‌ సెంటర్స్‌, టెస్టింగ్‌ ల్యాబ్‌, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్స్‌, ప్రీ కూలింగ్‌ యూనిట్స్‌, మొబైల్‌ ప్యాకింగ్‌ యూనిట్లు, గెలల రవాణా కోసం కన్వే బెల్టులు, రిఫ్రిజరేటెడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వెహికల్స్‌, నర్సరీలు, టిష్యూ కల్చర్‌ ల్యాబ్స్‌, సాయిల్‌ లీఫ్‌, ఎంఆర్‌ ఎల్‌, ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌసెస్‌, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయనున్నారు. సాగుదశలో విత్తనం నాటే దశ నుంచి కోత నిర్వహణ, పోస్ట్‌ హార్వెస్ట్‌ మేనేజ్‌ మెట్‌, వాల్యూ ఎడిషన్‌, లాజిస్టిక్స్‌, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ తదతర అంశాల్లో దశలవారీగా ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే రైతులకు శిక్షణ అందించనున్నారు. అరటి నిల్వలు, ప్యాకేజీల కోసం అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ప్యాక్‌ హౌస్‌లు, రెండు కోల్డ్‌ స్టోరేజీలతో పాటు- పులివెందులో నిర్మాణదశలో ఉన్న మరో ప్యాక్‌ హౌస్‌ ను వినియోగించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement