Friday, April 19, 2024

40 మంది సలహాదారులు అవసరమా?: ఏపీ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40 మందిని నియమించుకోవడం అవసరమా? అని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్షల్లో వారికి పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు ఎందుకు కల్పిస్తున్నారని నిలదీసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నారని మండిపడింది. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకూ లేవని పేర్కొంది.  గతంలో నియమితులైన సలహాదారులు మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపింది. ప్రస్తుతం కొంత మంది సలహాదారులు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొంది . దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు .. ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం మాత్రమే మీడియా ముందుకు వచ్చారని గుర్తుచేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

ఈ అంశంపై గురువారం ఇరుపక్షాల వాదనలు ముగియగా.. గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, ఎస్‌ఈసీ నీలం సాహ్ని తరఫు వాదనల కోసం విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో-వారంటో వ్యాజ్యం దాఖలు చేయగా, ఆయన తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఈసీ నియామకానికి చట్ట నిబంధనలను న్యాయమూర్తి పరిశీలించారు. ముఖ్యకార్యదర్శి హోదాకు తగ్గని అధికారి ఎస్‌ఈసీగా నియమితులయ్యేందుకు అర్హులని ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొంటే.. స్వతంత్ర అభ్యర్థి ఎస్‌ఈసీగా నియమితులు కావాలని ఎలా కోరుకుంటారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్లుగా నియమితులు అయ్యేందుకు ఐఏఎస్‌లే ఎందుకు.. ఇతర విభాగాల నుంచి అర్హులను ఎందుకు నియమించకూడదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఏజీకి సూచించారు. ఏజీ స్పందిస్తూ.. గత 45 ఏళ్లుగా దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఐఏఎస్‌లే ఎస్‌ఈసీలుగా నియమితులు అవుతున్నారన్నారు. ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో ఐఏఎస్‌లే ఎన్నికల కమిషనర్లుగా ఉన్నారన్నారు.

ఇది కూడా చదవండిః 62 మంది జూనియర్ జడ్జిలు బదిలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement