Thursday, April 18, 2024

AP: ఇకపై వైఎస్సార్​ హెల్త్‌ యూనివర్సిటీ.. ఉభయ సభల్లో ఆమోదించాం: విడదల రజని

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.వైయస్‌.రాజశేఖర్‌ రెడ్డి విశ్వ విద్యాలయంగా నామకరణం చేస్తూ బుధవారం అసెంబ్లీ, శాసన మండలిలో బిల్లు ఆమోదించడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. సచివాలయంలోని మీడియా పాయింట్‌లో బుధవారం ఆమె మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా డాక్టర్‌ కావడంతో వైద్య రంగానికి ఎంతో సేవ చేశారన్నారు. ఈవిధంగా ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైయస్‌ ఆర్‌ పేరు పెట్టడం ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

2004కు పూర్వం పేదలకు అనారోగ్యం వస్తే వారు ఇళ్ళు వాకిలి అమ్ముకుని రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. డా.రాజశేఖర్‌ రెడ్డి తన పాదయాత్రలో పేదలు పడుతున్న కష్టాలను చూసి చలించి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చి పేదలందరికీ ఆరోగ్య ప్రదాత అయ్యారన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ పేదల గుండెల్లో కొలవై ఉన్నారన్నారు. 108 అంబులెన్స్‌ సేవలును,104 మొబైల్‌ మెడికల్‌ అంబులెన్స్‌ సేవలును అందుబాటు-లోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి సియం గా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా కొత్తగా మరో మూడు వైద్య కళాశాలను తీసుకు వచ్చారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి సియం అయ్యాక ప్రభుత్వ రంగంలో మరో 17 వైద్య కళాశాలను ఏర్పాటు- చేస్తున్నారని తెలిపారు.

మొత్తం మీద వైయస్సార్‌, జగన్‌ కలిసి కొత్తగా 20 వైద్య కళాశాలలను ఏర్పాటు-కు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. వైద్య రంగంలో ఏటా 13వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 2వేల 246 ప్రొసీజర్‌ లు ఉండగా వాటిని రానున్న రోజుల్లో మూడు వేల వరకు పెంచడం జరుగుతుందని మంత్రి రజని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఎన్టీఆర్‌ అంటే అపారమైన ప్రేమ ఉండటం వల్లే జిల్లాల పునర్విభజనలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణము చేశారని మంత్రి రజని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement