అమరావతి,ఆంధ్రప్రభ: తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ- ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం తన అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రమన్నారు.
ఈ ఆనంద సమయంలో తన మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నానన్నారు. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం తనతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నానని చెప్పారు.