Thursday, April 25, 2024

చేతి సంచిలో ప‌సికందుతో ప‌రార్‌.. నిందితుల‌ను పట్టించిన సీసీటీవీ!

ఉక్కపోస్తోంద‌ని గాలికోసం నాలుగు రోజుల చిన్నారిని తల్లి పక్క నుంచి బయటకు తెచ్చారు. అమ్మమ్మ పక్కలో పడుకోబెట్టిన నాయినమ్మ బాత్రూమ్‌కి వెళ్లొచ్చేసరికి పసికందు మాయ‌మైంది. గుంటూరు జీజీహెచ్‌లో శనివారం తెల్లవారుజామున 4 రోజుల పసికందు అపహరణకు గురైంది. పోలీసుల‌కు విష‌యం తెలియ‌డంతో కొద్ది గంటల్లో శిశువు ఆచూకీ కనుగొన్నారు.

హాస్పిట‌ల్ వార్డు బాయ్.. మరో మహిళతో కలిసి పసికందును అపహరించినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. గుంటూరులోని మోతీలాల్ నగర్ ఒకటో లైన్‌లో చిన్నారిని గుర్తించారు. మరో మహిళతో కలిసి శిశువును ఎత్తుకెళ్లిన వార్డు బాయ్ హేమ వరుణుడు.. నెహ్రూనగర్‌‌ సమీపంలోని మోతీలాల్ నగర్‌లో దాచిపెట్టాడు. పసికందు అపహరణకు గురైన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లి చెంతకు బిడ్డను క్షేమంగా చేర్చారు.

గుంటూరు జిల్లా పెద కాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 13న జీజీహెచ్‌లో బాబుకు జన్మనిచ్చింది. బాలింతను, శిశును చూసుకోవడం కోసం.. అమ్మమ్మ, నానమ్మ ఇద్దరూ ఆస్ప‌త్రిలోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి ఉక్క‌పోతకు పసికందు ఏడుస్తుండటంతో.. గాలి కోసమని నాన్నమ్మ బాబును బయటకు తీసుకొచ్చింది. తర్వాత బాత్రూమ్‌కు వెళ్తూ.. అమ్మమ్మ పక్కన ఉంచి వెళ్లింది.

ఆమె తిరిగొచ్చే సరికి.. కేవలం ఐదు నిమిషాల్లోనే పసి కందును అపహరించారు. దీంతో ఆందోళన చెందిన బాధితులు.. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి… హాస్పిటల్ గేటు ముందున్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నడి వయస్కుడైన ఓ వ్యక్తి చిన్నారిని ఓ సంచిలో వేసుకొని తీసుకెళ్లడం కనిపించింది.

అయితే, అతడి కంటే ముందు ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లింది. సెక్యూరిటీ సిబ్బంది ముందు నుంచే వారు వెళ్లినప్పటికీ.. బాబు సంచిలో ఉండటంతో.. ఎవ‌రికీ అనుమానం రాలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాబును సంచిలో తీసుకెళ్లిన వ్యక్తిని వార్డు బాయ్ హేమ వరుణుడిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement