Friday, March 29, 2024

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలూ మీరే నిర్వ‌హించండి – నిమ్మ‌గ‌డ్డ‌కు మంత్రి పెద్దిరెడ్డి స‌ల‌హా..

అమ‌రావ‌తి – ఎపిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ప్ర‌స్తుత రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆధ్వ‌ర్యంలోనే జర‌గాల‌ని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలకు అడ్డు తొలగిపోయిందని, న్యాయపరమైన అవరోధాలన్నీ తొలగిపోయాయని తెలిపారు. దీంతో మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆరు రోజుల్లో నిర్వహించ వచ్చని మంత్రి పేర్కొన్నారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఎస్‌ఈసీ వంటి సంస్థలకు పరిమితితో కూడిన కొన్ని అధికారాలు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలే కానీ, అతిక్రమించకూడదు. కరోనా కారణంగా పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌..ఆ తరువాత ఎక్కడ నుంచి నిలిపివేశామో అక్కడి నుంచి మొదలుపెడుతామని కోర్టుకు చెప్పారు. దానికి విరుద్ధంగా ముందుగా సర్పంచ్‌ ఎన్నికలు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీసేలా, టీడీపీకి మేలు చేసేలా ఎస్‌ఈసీ వ్యవహరించారు. సుప్రీం కోర్టు, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నికల హామీలను నెరవేర్చడంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. ఈ రోజు ఎన్నికలు పూర్తి చేసేందుకు ఏ అడ్డంకులు లేవు.
ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయవచ్చు. తప్పకుండా కమిషనర్‌ ఎన్నికలు నిర్వహించాలి. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డనే నిర్వహించారు కాబట్టి..ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి రిటైర్డు అయితే బాగుంటుంది. తొందరగా ఎన్నికలు ముగిస్తే..ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తుంది. ఇప్పటికే పోలీసులు, అధికారులు ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ఆరు రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement