Thursday, April 25, 2024

గిరిజనాభివృద్ధికి గ్రీన్‌ ఫీల్డ్‌ బాటలు…

పాచిపెంట, ప్రభన్యూస్ : గిరిపుత్రుల దశ తిరగనుంది. శతాబ్దాలుగా మన్యంలో మగ్గిపోయి నానా అవస్థలు పడుతున్న వారికి గ్రీన్‌ ఫీల్డ్‌ సిక్స్‌ లైన్‌ రోడ్డుతో వారి అభివృద్ధికి నాంది పలుకుతోంది. సిక్స్‌ లైన్‌ రోడ్డుతో అటవీ ఉత్పత్తులును గిట్టుబాటు ధరకు విక్రయించేందుకు వారికి త్రోవ దొరికినట్టే. గిరిజనుల కళ ఈ రహదారి నిర్మాణంతో కొంతవరకు నెరవేరి నట్టేనని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెంటాడ మండలం జక్కువ నుంచి పాచిపెంట మండలం ఆలూరు గిరిజన గ్రామం వరకు సుమారు 31.66 పొడవున సిక్స్‌ లైన్‌ ఈ రహదారి నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 1060 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. విశాఖపట్నం నుంచి చత్తీస్ఘడ్‌ రాష్ట్రం రాయిపూర్‌ వరకు 20 వేల కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణము జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రా – ఒడిస్సా రాష్ట్రాల్ర మధ్య బోర్డర్‌ రహదారి పనులు హెచ్‌ జి ఇన్ఫా ఇంజనీరింగ్‌ ప్యాకేజీ పనులను వచ్చే బుధవారం నుంచి సంబంధిత నేషనల్‌ హైవే కాంట్రాక్టర్లు జి.ఎం.రాజశేఖర్‌ ప్రారంభించనున్నారు. స్థానికంగా చూసుకుంటే నాలుగు మండలాలకు( సాలూరు, మెంటాడ, పాచిపెంట, రాంబద్రపురం)కలిపితే ఈ రహదారి తో అభివృద్ధి సాధ్యపడుతుందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీనికోసం ఇటీవల పాచిపెంట అటవీ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన రిటైర్డ్‌ అటవీశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సి.ఎన్‌.రావు రహదారి పనులకు అటవీ శాఖ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలియజేసి, అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. అందుకే బుధవారం నుంచి పనులు ప్రారంభించనున్నట్టు ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

30 కిలోమీటర్లు రహదారి నిర్మాణంతో లక్షలాది మంది గిరిజన ప్రజలు, గిరిజనేతరులు అభివృద్ధి చెందుతారని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. ఈ రహదారి నిర్మాణంతో ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీస్గడ్‌ రాష్ట్రాల్ర మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. సకాలంలో ఈ పనులు జరిగితే పాచిపెంట మండల గిరిజన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా సౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు. రహదారి పనులు చేపట్టడానికి ఎటువంటి ఇబ్బందులు లేవని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి చెందే గ్రామాల్లో మోదుగ, ఆలూరు, రిట్టల పాడు మరిన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ రహదారి పనుల్లో వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నష్టపరిహారం అందించినట్లు విలేఖర్లకు తెలిసింది. ఒకవేళ నష్ట పరిహారం అందని రైతులు ఎవరైనా ఉంటే రెవెన్యూ తాసిల్దార్‌ వద్దకు వెళ్లి పిర్యాదు చేసుకోవచ్చని సంబంధిత జిల్లా అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement