Monday, April 15, 2024

పోలీసులకు సవాల్‌.. ఈ క్రిమినల్ ఇంకా దొరకలే

అమరావతి ఆంధ్రప్రభ: గుంటూరు జిల్లా సీతానగ రం కృష్ణానదీ తీరంలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో రెండో నిందితుడు ప్రసన్న కుమార్‌ రెడ్డి(వెంకట రెడ్డి) కోసం తాడేపల్లి పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో నిందితుడు ఫోటో, వివరాలను పోలీసులు తాజాగా పోస్ట్‌ చేశారు. ఫేస్‌ బుక్‌, వాట్సప్‌ స్టేటస్‌ లలో నిందితుడి ఫోటో వివరాలు పోస్ట్‌ చేశారు. నిందితుని ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ మొబైల్‌ నంబర్లను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

ఈ ఏడాది జూన్‌లో సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద విహారానికి వచ్చిన ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి కొట్టారు. యువకుడిని బంధించి పక్కన ఉన్న యువతిపై గ్యాంగ్‌ రేప్‌ కు పాల్పడ్డారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం చెలరేగింది. వైసీపీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడం కూడా జరిగింది. ఈ కేసును ఛాలెంజ్‌ గా తీసుకున్న జిల్లా పోలీస్‌ అధికారులు గాలించి ఎట్టకేలకు ప్రధమ నిందితున్ని పట్టుకొని కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించడం జరిగింది.

ఆనాటి నుండి నేటి వరకు రెండో ముద్దాయిని పోలీసులు అరెస్ట్‌ చేయలేకపోయారు. ఈ క్రమంలో పోలీసులు రెండో నిందితుడు ప్రసన్న కుమార్‌ రెడ్డి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు నిందితుడిని కని పెట్టడానికి వాట్సాప్‌ ఫేస్‌ బుక్‌ లను ఆశ్రయించారు. నిందితుడి వివరాలను, నిందితుడిని ఫోటోను పోస్ట్‌ చేసి ఎవరి-కై-నా కనబడితే వివరాలను తెలపాలని పోలీస్‌ అధికారుల నెంబర్లు కూడా తెలియజేయడం జరిగింది.

విజయవాడ సమీపం లోని సీతానగరం ఇసుకతిన్నెలపై కాబోయే భర్తతో సేదదీరేందుకు వెళ్లిన యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. భర్తపై దాడి చేసి యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు తర్వాత వారిద్దరిని బెదరించి అక్కడ నుంచి పరారయ్యారు. యువతిపై సామూహిక అత్యాచారం ఘటనకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించడమే కాదు ఆయన కలత చెందారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ని ఆదేశించారు. అంతేగాక గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి వద్దకు హోంమంత్రి మేకతోటి సుచరితను పంపించి బాధితురాలి కుటుంబానికి హోంమంత్రి ద్వారా ఐదు లక్షల చెక్కును అందింపచేశారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఘటన జరిగిందంటు శాంతి భద్రతల అంశాన్ని విపక్షాలు ఆరోపించాయి కూడా. సీతానగరం పరిసర ప్రాంతాల్లో అవారాగా తిరిగే గంజాయి, బ్లాడ్‌ బ్యాచ్‌ ముఠాల సభ్యుల ముఠాల ఫోటోలను పోలీసులు బాధిత యువతికి చూపించగా ఆమె ఇద్దరిని గుర్తించారు. వారిని సీతానగరం ప్రాంతానికి చెందిన కృష్ణ, వెంకటరెడ్డిగా పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఇద్దరిపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

- Advertisement -

నిందితులను నిర్ధారించుకున్నాక పోలీసు బృందాలు విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణా లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాయి. కృష్ణ, వెంకటరెడ్డి స్నేహితులను విచారించారు. విజయవాడ కమిషనరేట్‌కు చెందిన ప్రత్యేక క్రైం పోలీసు బృందాలు కూడా గాలింపును కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 250 మందికి పైగా అనుమానితులను పోలీసు బృందాలు ప్రశ్నించాయి. ఈ కేసులో ఒక నిందితుడు పట్టుబడగా పరారీలో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇక నిందితుని కోసం పోలీసులు సోషల్‌ మీడియాను ఆశ్రయించారు. ప్రజల సహకారంతో నిందితున్ని పట్టుకోవాలన్నది పోలీసుల యోచనగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement