Thursday, April 25, 2024

టీడీపీలోకి ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ ?

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : యూపీఏ తెలుగు రాష్ట్రాన్ని ఎప్పుడు విడదీసిందో అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. తెలంగాణలో హడావుడి చేసే దశకు పరిమితమైంది. ఏపీలో పూర్తి నిశ్శబ్దం. రాష్ట్రం విడిపోగానే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల్లో  చేరిపోయారు. మిగిలినవారు నామ్ కే వాస్తే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న మాజీ మంత్రి అనంతపురంకు చెందిన రఘువీరా రెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జోలికి కూడా రావడంలేదు. తరువాత పగ్గాలు తీసుకున్న మరో మాజీ మంత్రి అనంతపురంకు చెందిన శైలజానాథ్ ను అధిష్టానం హఠాత్తుగా తొలగించింది.

గిడుగు రుద్రరాజుకు ఆ బాధ్యతలు అప్పగించింది. శైలజానాథ్ తన తొలగింపును అవమానకరంగా ఫీలవుతున్నట్లున్నారు. అందుకే పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోంది. దానిమీద సంకేతాలు ఇచ్చారు. తానూ వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచే పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేసే సంగతి మూడు నెలల తరువాత చెబుతానని అన్నారు. అంటే పార్టీ మారే ఉద్దేశం ఉన్నట్లే కదా. టీడీపీ నుంచి పోటీ చేస్తారా అని అడిగితే ఇప్పుడే చెప్పను. మూడు నెలల తరువాత చెబుతానని అన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయన టీడీపీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement