బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఈ రోజు ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడుతోపాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కళ్యాణి జలాశయానికి వరదనీరు పోటెత్తింది. దీంతో జలాశయం 3 గేట్లను అధికారులు ఎత్తారు. స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షంతో తిరుపతిలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. తిరుమల రెండో కనుమ రహదారిని టీటీడీ అధికారులు మూసివేశారు. రెండో కనుమ రహదారిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి కనుమ రహదారిలోనే భక్తులను అనుమతిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..