Wednesday, April 24, 2024

Breaking: టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన శోభా హైమావతి

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీని వీడారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి వైసీపీలో చేరారు. నిన్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయనగరం మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతి రాజు కూడా వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్‌సీపీలోకి వచ్చానని శోభా హైమావతి తెలిపారు. సీఎం జగన్ ఆప్యాయతతో కూడిన పలకరింపు తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్‌ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తూ గౌరవిస్తున్నారని ముఖ్యమంత్రి విధానాలను ఆమె కొనియాడారు. రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలకు ఆసరా ఇస్తున్నారని, కింది స్థాయిలో ఉన్న వారికి కూడా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని తెలిపారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తామని శోభా హైమావతి తెలిపారు.

కాగా, శోభా హైమవతి కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదనే మనోవేదనతో ఆమె టీడీపీని వీడారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ కోట నుంచి ఆమె గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అనుబంధ మహిళా విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాలిగా కూడా ఆమె పనిచేశారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement