Thursday, April 25, 2024

విజయసాయి జైలుకెళ్లడం ఖాయం: వడ్డే శోభనాద్రీశ్వరరావు

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయికి మతి భ్రమించిందని ఆయన అన్నారు. ఏ రోజైనా అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్తారంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే… ఆయన మతి స్థిమితం కోల్పోయారనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు.

అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న విజయసాయి ఇప్పటికే 15 నెలలు జైల్లో ఉండొచ్చారని, చాలా కాలంగా బెయిల్ పై ఉన్నారని చెప్పారు. ఏదో రోజు ఆయన బెయిల్ రద్దవుతుందని… అప్పుడు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.  రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో పద్ధతిలో వేలకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా జగన్  దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని.. అందులో ప్రధాన సూత్రధారి ఏ2గా విజయసాయి రెడ్డి పేరుందన్నారు. వేలాది ఎకరాలను దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు దానం చేసిన చరిత్ర అశోక్ రాజు కుటుంబానిదని తెలిపారు. ఆంధ్రా యూనివర్శిటీకి 600 ఎకరాలు దానం చేశారని గుర్తు చేశారు. అశోక్ రాజును విమర్శించే స్థాయి విజయసాయికి లేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

కాగా, మాన్సాస్‌ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌ గజపతిరాజు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అశోక్‌ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్‌ గజపతిరాజు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం చైర్మన్‌ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని వెల్లడించారు. అశోక్‌ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement