Thursday, April 25, 2024

పీఎం కిసాన్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఈ నెలాఖరులోపు రైతులందరి ఈ-కేవైసీ పూర్తి చేయాలని రాష్ట్రాల్రకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు ఇకపై ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం వర్తింప చేయలేమని కూడా స్పష్టం చేసింది. పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా మూడు విడతలుగా రూ 6 వేల ఆర్ధికసాయం అందిస్తోంది. ఈ పథకం దుర్వినయోగమవుతోందనీ, అర్హత లేని వారు కూడా లబ్ది పొందుతున్నట్టు ఆరోపణలు వెల్లవెత్తుతుండటంతో ఈ-కేవైసీనీ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంతేకాదు.. ఈ-కేవైసీసీ పూర్తి చేయని రైతులకు 13 వ విడత పీఎం కిసాన్‌ ఆర్ధిక సహాయాన్ని నిలుపుదల చేస్తామని కూడా ప్రకటించింది.

ఈ నెలాఖరు లోపు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రాల్రను ఆదేశించింది. ఏపీలో అధికారికంగా గుర్తించిన క్రియాశీలక రైతుల సంఖ్య 49,13,283 మంది ఉండగా వారిలో ఇప్పటివరకు 35,16,597 మంది ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా 13,96,686 మంది ఈ-కేవైసీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ-కేవైసీ ప్రక్రియ పురోగతిని ఏరోజుకారోజు పర్యవేక్షిస్తూ నెలాఖరులోపు నూటికి నూరు శాతం లక్ష్యం చేరుకోవాలన్నారు. రైతులు కూడా స్వచ్ఛంధంగా ఈ-కేవైసీ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement