Sunday, March 24, 2024

ఏప్రిల్‌ 1 నుండి ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు.. టిటిడి ఛైర్మన్‌

తిరుమల : భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారంరోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్‌ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300ల దర్శన టికెట్లు తగ్గించనున్నామ‌న్నారు. ఈ మూడు నెలల పాటు విఐపిలు సిఫారసు లేఖలను తగ్గించాలని కోరడమైనదన్నారు. తద్వారా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు.

ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తామ‌న్నారు. తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందన్నారు. దాదాపు 85శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగిందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగిందన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌, పిఏసి 2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామ‌న్నారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకుంటామ‌న్నారు. టిటిడి విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తామ‌న్నారు.శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తామ‌ని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement