Friday, March 29, 2024

Destroyer – నాలుగేళ్ల‌లో ఎపిని స‌ర్వ‌నాశ‌నం చేసిన ఘ‌నుడు జ‌గ‌న్ – చంద్ర‌బాబు

విజ‌య‌వాడ – తొమ్మిదేళ్లయినా రాజధాని ఏదీ అంటే చెప్పుకోలేని దీనపరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు..జగన్ నాలుగేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు..ఇక ఎపిలో ఈ నాలుగేళ్ల‌లో రాష్ట్ర ప్రగతి నిలిచిపోయింద‌ని,. మద్యం ఏరులై పారుతోంద‌ని విమ‌ర్శించారు.. విశాఖను ఐటి హబ్ గా చేయాల‌ని తాను భావిస్తే జ‌గ‌న్ దానిని గంజాయి హబ్‌గా మార్చార‌ని పేర్కొన్నారు..

తెలుగు జాతి అభ్యున్నతికి కృషి.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్నదే తెలుగు దేశం పార్టీ
ఉద్దేశమని, తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. నాడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం పని చేశానని, తాజాగా తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సి ఉందని అన్నారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారని, తద్వారా దేశానికి దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి అని కొనియాడారు. పీవీ నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. అదే విధంగా ఎన్టీఆర్‌.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు.

- Advertisement -

తాము అధికారంలో ఉండ‌గా , సంస్కరణలు, సంపద సృష్టితో ముందుకు వెళ్లామ‌న్నారు . సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందించాం అని చంద్రబాబు తెలిపారు. నాలెడ్జ్‌ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినపుడు ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌, రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చిందని వెల్లడించారు. పరిపాలన, ప్రభుత్వ విధానాల ద్వారా ఇబ్బంది లేకుండా చూశామని, సవాళ్లను అధిగమించి ఏపీ నంబర్‌వన్‌గా ఉండాలని లక్ష్యం పెట్టుకుని 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని వివరించారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని వెళ్లాం.. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశామ‌ని, సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్లాం అని తెలిపారు.

టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్‌ నాటికి పోల‌వ‌రం పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టును రివర్స్‌ చేసిందని, కేంద్రం, పీపీఏ చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రాజెక్టుకు నష్టం జరుగుతుందని హెచ్చరించినా వినలేదని మండిపడ్డారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వరదలు వచ్చి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిని నష్టం జరిగినట్లు తెలిపారు. 2025 నాటికి తొలి విడత పూర్తవుతుందని చెబుతున్నారంటే.. ప్రాజెక్టు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి జగన్​కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి రూపకల్పన చేశామ‌ని,29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలు అందించడం ద్వారా సంపద సృష్టిలో భాగస్వాములయ్యారని చంద్రబాబు వివరించారు. అప్పట్లోనే రాష్ట్రానికి 139 సంస్థలు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయ‌న్నారు. రాజధాని కొనసాగి ఉంటే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చి ఉండేది అని చంద్రబాబు తెలిపారు. మొత్తం స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని, చివ‌ర‌కు ఎపికి రాజ‌ధాని లేకుండా పోయింద‌ని బాధ‌ను వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement