Wednesday, April 24, 2024

ఆ పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు

వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్‌ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన  విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చ జరిపారు.

రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు, తదితర అంశాలను సమావేశంలో డీజీపీ వివరించారు. మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమైందని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్నారు.  గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అతిపెద్ద కార్యక్రమమని, దీనిపట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని డీజీపీ వెల్లడించారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమని డీజీపీ చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామన్నారు. అంతేకాదు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసా కూడా ఇస్తున్నాం అని తెలిపారు. ప్రతి ఏటా రూ.13,500 గిరిజన రైతుల చేతిలో పెడుతున్నామన్న సీఎం..ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగుకోసం కార్యాచరణకూడా రూపొందించామని చెప్పారు. దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. 31,155 ఎకరాల డీకేటీ పట్టాలను 19,919 మంది గిరిజనులకు ఇచ్చామని వివరించారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చామని, వాలంటీర్లగా వారిని నియమించామని గుర్తు చేశారు. తద్వారా పెద్ద సంఖ్యలో గిరిజనులకు ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. వారి గ్రామాల్లోనే వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రైబల్‌ ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్‌ ఇచ్చామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గిరిజనుల జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయన్నారు.  36 షెడ్యూలు మండలాల్లో పాఠశాలలు, హాస్టళ్లను నాడు -నేడు కింద 10అంశాల ద్వారా మెరుగుపరుస్తున్నామన్నారు. నాడు –-నేడు కార్యక్రమాలకు తగిన సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు.

- Advertisement -

అలాగే షెడ్యూలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేస్తున్న నాడు–నేడు కార్యక్రమాలకూ తగిన సహకారాలు అందించాలంటూ కేంద్రాన్ని కోరాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ట్రైబల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న టవర్ల మ్యాపింగ్‌ జాగ్రత్తగా చేయాలని సమావేశానికి హాజరైన టెలికాం అధికారులకు సీఎం ఆదేశించారు. దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. సమగ్రంగా ఇంటర్నెట్, మొబైల్‌ టెలికాం సౌకర్యం ఇచ్చేలా విధానం ఉండాలని సీఎం సూచించారు. దీనిపై ఒక ప్రణాళిక రూపొందించి, ఆమేరకు కేంద్రం సహకారం కోరాలన్నారు. ఒక్క గ్రామం కూడా మిగిలిపోకుండా అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్, మొబైల్‌ సౌకర్యం కల్పించే దిశగా అడుగులేయాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు ఉన్న ప్రతిచోటా కూడా పోస్ట్‌ ఆఫీసు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆమేరకు మ్యాపింగ్‌ చేసుకుని, మిగిలిన పోస్ట్‌ ఆఫీసులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని  కోరాలన్నారు. ట్రైబల్‌ యూనివర్శిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. గిరిజనుల్లో చాలామంది పిల్లలకు ఆధార్‌ లేదన్న అధికారులు తెలుపగా.. ట్రైబల్‌ ప్రాంతాల్లో అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్‌ సెంటర్లుగా గుర్తించేలా కూడా కేంద్రాన్ని కోరాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement