Tuesday, April 16, 2024

AP: కోవిడ్‌ కేర్‌ సెంటర్లను సిద్ధం చేయండి: కరోనాపై సీఎం జగన్ కీలక ఆదేశాలు


ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలని ఆదేశించారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలన్న సీఎం.. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశించారు.  సినిమా థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని, మాస్క్‌ తప్పనిసరి చేయాలని తెలిపారు. రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ ఉంచాలని ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలన్నారు.

సోమవారం కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి, వాటి పనితీరును స్వయంగా వైద్య నిపుణులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని  అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కరోనా కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలన్నారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలన్నారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో 104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలన్న సీఎం జగన్.. ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement