Monday, April 22, 2024

ఏపీలో కేజ్‌ ఫిష్‌ కల్చర్‌.. ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌..

మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలని సీఎం జగన్ అన్నారు. సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. చేపల వినియోగం పెరగాలని, పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషరీస్ విభాగాలపై వైఎస్‌ జగన్‌ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చేపల రవాణా, నిల్వ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మంచి ధరలు అందాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

ఇటు రైతులకు, అటు వినియోగదారులకు మేలు చేయడానికే ఆక్వాహబ్‌లు తీసుకు వచ్చామన్నారు. ఆక్వా లాబ్స్‌ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్‌ ఎలా చేయించుకోవాలన్నదానిపై అవగాహన పెంచాలన్నారు. ఈ ల్యాబ్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని, ఆక్వా సీడ్, ఫీడ్‌ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని తెలిపారు.

ఆక్వాహబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్‌ దుకాణాల వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానికంగా ఉన్న వినియోగం 4.36లక్షల మెట్రిక్ టన్నులు, దీన్ని ఏడాదికి 12 లక్షల మెట్రిక్‌ టన్నులు చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. 5 ఫిషింగ్‌ హార్బర్లు, 1 ఫిస్‌ ల్యాండ్‌ సెంటర్‌లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేజ్‌ ఫిష్‌ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలని, ఆదాయాలు బాగా పెరుగుతాయని తెలిపారు.  కేజ్‌ ఫిష్‌ కల్చర్‌పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, రైతులు, ఔత్సాహికులతో కలిసి ముందుకు సాగేలా ఒక ప్రణాళిక తీసుకురావాలని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్‌ ఫిష్‌ కల్చర్, మూడు చోట్ల మరీకల్చర్‌లను మొదలుపెట్టాలని తెలిపారు. వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలని, ప్రతి గ్రామం, మండలంలో ఏం ఉండాలనేదాన్ని నిర్ధారించాలని అధికారులకు సీఎం సూచించారు.

హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను పెట్టాలని, తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు. అయితే కొన్ని డిస్పెన్సరీలు లేని మండలాలు కూడా ఉన్నాయని అధికారులు ముందు మ్యాపింగ్‌ చేసి తర్వాత వాటిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందు నిర్దారించుకోలన్నారు. ఏయే రకాల మౌలిక సదుపాయాలు  కల్పించాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలన్నారు. తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఏపీ అమూల్‌ ప్రాజెక్టు అమలుకు సంబంధించి సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాలవెల్లువ ప్రారంభం అయినట్లు తెలిపారు. ఆగస్ట్ లో ఏపీ అమూల్‌ను విశాఖపట్నం, అనంతపురం జిల్లాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement