Tuesday, March 26, 2024

వ్యాక్సినేషన్‌ వేగవంతంపై సీఎం జగన్ దిశానిర్దేశం

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.  బుధవారం కరోనా వైరస్‌ నివారణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.  కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ–టైప్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం జగన్ అన్నారు.  దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలన్నారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలన్న సీఎం… ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.

100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నామని, కొత్త మెడికల్‌ కాలేజీల కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తిచేయాలన్నారు. వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం జగన్.. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని ఆదేశించారు. మే, జూన్‌, జులై నెలల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు 43.38 లక్షల డోసులు ఇస్తే.. కేవలం 5,24,347 డోసులు మాత్రమే వాడారని  అధికారులు సీఎంకు తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వానికి ఇస్తే వ్యాక్సినేషన్‌ను వేగంగా ముందుకు సాగుతుందని, దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్‌ అనంతరం అక్కడి కోవిడ్‌ తీరు తదితర అంశాలపై అధ్యయనం చేయాలన్న సీఎం.. దీనికోసం ఒక కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ అంశాలపై కమిటీ అధ్యయనం అనంతరం నివేదిక సమర్పించాలని తెలిపారు. తద్వారా కోవిడ్‌ నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నూతన మెడికల్‌ కళాశాలల కోసం పెండింగ్‌ ఉన్న చోట భూసేకరణను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కొత్త మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిపై వచ్చే సమావేశంలోగా తనకు నివేదిక ఇవ్వాలన్నారు. 16 కాలేజీల పనులపై పూర్తి వివరాలు అందించాలని తెలిపారు. ఒకవేళ పనులు మొదలు కాకపోతే…. వెంటనే పనులు మొదలుపెట్టించి ఆ వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. నాడు–నేడు వైద్యఆరోగ్యశాఖలో పనులపైనా ప్రజంటేషన్‌ ఇవ్వాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement