Friday, March 29, 2024

డ్వాక్రా మహిళలను మోసం చేశారు: చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల బాధలు చూశానన్నారు. రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. నేటి నుంచి అక్టోబర్ 18 వరకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.

నాలుగు విడతల్లో రూ.25,512 కోట్లు జమ చేస్తామని సీఎం వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా కడప జిల్లాలో నవంబర్‌ 6 నుంచి 15 వరకు ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. డ్వాక్రా మహిళలను మోసం చేశారని సీఎం మండిపడ్డారు. చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. రుణాలు కట్టొద్దని 2014 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆ మాటలు నమ్మి ఆయనకు ఓటేశారన్నారు. కానీ చంద్రబాబు అక్కచెల్లెమ్మలకు దగా చేశారని ఆరోపించారు.

వైఎస్సాఆర్ పెన్షన్ ద్వారా 61 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు కేలవం 44 లక్షలు మాత్రమేనన్న సీఎం.. టీడీపీ ప్రభుత్వం నెలకు 450 కోట్లు కేటాయించిందన్నారు. అయితే, తాము పెన్షన్ కోసం 1450 కోట్లు ఇస్తున్నట్లు వివరించారు. జగనన్నవిద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. సున్నా వడ్డీ ద్వారా కోటీ మందికి 2,354 కోట్లు ఇచ్చామన్నారు. కాపునేస్తం ద్వారా ఇప్పటికే 982 కోట్లు ఇచ్చినట్లు సీఎం వివరించారు.

కాగా, వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87.74 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా రూ. 6,792 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో అక్టోబర్‌ 7 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జమ చేయున్నారు. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకం తీసుకొచ్చారు.

- Advertisement -

కరోనా కష్టకాలంలో, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత నిధులు విడుదల చేయనుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరినీ రుణ విముక్తుల్ని చేసేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి సుమారు 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87,74 లక్షల అక్కచెల్లెమ్మలకు ఉన్న అప్పు నిల్వ రూ. 27,168 కోట్లను 4 విడతలలో చెల్లిస్తానని చెప్పారు. గతేడాది మొదటి విడత రూ. 6,792 కోట్లను మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమ చేశారు. మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది.

ఇది కూడా చదవండి: బద్వేలు బీజేపీ అభ్యర్థి ఇతనే..

Advertisement

తాజా వార్తలు

Advertisement