రాష్ట్రంలో 10 లక్షల కిశోర బాలికలకు ఉచితంగా న్యాపికిన్లు పంపిణీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మంగళవారం మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’కార్యక్రమాన్ని సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. రుతుక్రమ సమస్యలతో చదువులు ఆగిపోతున్నాయని, 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 10, 388 స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో ఉచితంగా బ్రాండెడ్ న్యాప్కిన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్కిన్లు అందిస్తామన్నారు. ప్రతి నెలలో కార్యక్రమం జరిగేలా జిల్లాలో జేసీ పర్యవేక్షించాలని చెప్పారు. మహిళా టీచర్లు, ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, ‘స్వేచ్ఛ’ పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్ను నియమించామని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్లలో నాణ్యమైన న్యాప్కిన్స్ తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. మహిళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ చేయూత స్టోర్లలో శానిటరీ న్యాప్కిన్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.