Saturday, April 20, 2024

7వేల దొంగ ఓట్లు నమోదు చేసిన వైసీపీ.. ఎమ్మెల్యే నిమ్మల

తిరుపతి సిటీ, మార్చి 7 (ప్రభ న్యూస్): ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 13 తేదీ జరగనున్న ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్ఆర్సిపి తిరుపతి నియోజకవర్గంలో 7 వేలదొంగ ఓట్లను నమోదు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరిశీలకులు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుందన్నారు. తిరుపతి వైఎస్ఆర్సిపి కార్యాలయంలోనూ 36 దొంగ ఓట్లను నమోదు చేయడం జరిగిందని వివరించారు. పెద్దల సభను అగౌరవ పరిచేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. శాసనమండలిని రద్దు చేయాలని గతంలో చెప్పిన ఘనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో ఓటు హక్కును పొందాలని, డిగ్రీ సర్టిఫికెట్ ను కలర్ జిరాక్స్ చేసి ఫోటోషాప్ లో పేర్లు మార్చి ఓటు హక్కును పొందడం జరిగిందన్నారు. ఏడో తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా ఓటర్లుగా నమోదు చేశారన్నారు.

అదేవిధంగా ఇల్లులు లేవు ఖాళీ స్థలాల్లో ఓట్లు ఉన్నట్లు రికార్డులో నమోదు చేయడం జరిగిందన్నారు. శాసనమండలిలో ప్రజల తరఫున గళం వినిపించేందుకు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని విన్నవించారు. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈనెల 13వ తేదీ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆశ కల్పించడంతోపాటు, మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రకటన చేసి వాటిని తుంగలో తొక్కడం జరిగిందన్నారు. ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి సుగుణమ్మ, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఊకా. విజయ్ కుమార్, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సురా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, కార్పొరేటర్ఆర్ సి మునికృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు సంజయ్, నగర కార్యదర్శి మహేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement