Thursday, April 18, 2024

ముమ్మరంగా తిరుపతి స్టేషన్ పునరాభివృద్ధి పనులు

రాబోయే 40 ఏళ్ల ను దృష్టిలో ఉంచుకొని రైలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దెందుకు దక్షిణ మధ్య రైల్వే , తిరుపతి స్టేషన్ పునరాభివృద్ధి పనులను చేపట్టింది. మే 2022లో ప్రారంభించిన ఈ పునరాభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పనులు సకాలంలో పూర్తయ్యేలా అన్ని స్థాయిలలో పనిని పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులను చేపట్టేందుకు ఈపిసి విధానంలో కాంట్రాక్టు అప్పగించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మొత్తం పనులు ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి స్టేషన్ భవనానికి దక్షిణం వైపున కొత్త స్టేషన్ భవనం రాబోతోంది. జియోలాజికల్ సర్వే పూర్తయిన తర్వాత, క్యాంపు కార్యాలయం, కాంక్రీట్ ల్యాబ్ & స్టోరేజీ షెడ్ల ఏర్పాటు కు సంబంధించిన పనులతో పాటు మిగిలిన పనులు కుడా వేగంగా కొనసాగుతున్నాయి. కొత్త స్టేషన్‌ భవనానికి పునాదులు కాంక్రీటింగ్ పనులు 100 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు, ఫౌండేషన్‌లు, బేస్‌మెంట్ ఫ్లోర్ యొక్క స్తంభాలు, రిటైనింగ్ వాల్‌లో సుమారు 7,450 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును ఉపయోగించారు. తదుపరి దశలో, బేస్‌మెంట్ ఫ్లోర్ కోసం కాంక్రీట్ స్లాబ్‌ను సెంట్రింగ్, షట్టరింగ్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి సంబందించిన పనులు ఇప్పటి వరకు దాదాపు 20% మేర పనులు పూర్తయ్యాయి.

కొత్త స్టేషన్ భవనంలో 29 లీటర్ల నీటిని నిల్వచేసే సామర్థ్యంతో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు కానుంది. దీని కోసం, భూగర్భ ట్యాంకు నిర్మాణ కోసం తవ్వకం పనులు మరియు పునాదులకు కాంక్రీటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌ ను పునరాభివృద్దిలో భాగంగా స్టేషన్ కు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం రెండు కొత్త ఎయిర్ కాన్‌కోర్సులను నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ఎయిర్‌కోర్స్‌లు 35 మీటర్ల వెడల్పుతో ఉంటాయి . స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లను మరియు స్టేషన్ భవనాలకు రెండు వైపులా (ఉత్తరం మరియు దక్షిణం) కలుపుతాయి. ప్లాట్ ఫారం నెం 4 & 5లో ఎయిర్‌కోర్సుల పునాదుల కోసం తవ్వకం పనులు ప్రారంభించబడింది. ఇందుకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. తిరుపతి స్టేషన్ పునరాభివృద్ది పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తద్వారా పనులకు ఆటంకం కలగకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. స్టేషన్‌లో ప్రయాణికులకు, రైళ్ల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత జాగ్రత్తగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement