Saturday, April 20, 2024

Tirumala : శోభాయమానంగా పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది.
వేడుకగా స్నపన తిరుమంజనం :
అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. పుష్ప‌యాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో 2.5 టన్నులు తమిళనాడు, 1.5 టన్నులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు.
వైభవంగా పుష్పాల ఊరేగింపు :
ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement