Friday, April 19, 2024

సమాజానికి భరోసా ఇచ్చే వారేరీ…? – శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద

తిరుపతి, హిందూ సమాజానికి భరోసా ఇవ్వగలిగిన నాయకులు లేరని , హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడే వారిని మాత్రమే సమాజ నాయకులుగా ఎన్నుకోవాలని శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. గురువారం స్థానిక భీమాస్ రెసిడెన్సి లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు రాజకీయాలకతీతంగా ,స్వచ్ఛమైన హిందువులతో ఒక బోర్డును ఏర్పాటు చేసి పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుల ఆచారాలు, దేవాలయం పరిరక్షణకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి నాయకులుగా రావాలని ఆకాంక్షించారు. హిందువుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. హిందువుల ప్రాథమిక హక్కులను హరించే కొండా దేవాలయాల విధివిధానాలను పరిరక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నారు. రాజకీయ నాయకుల ప్రాబల్యం వలన రాయలసీమకు దేశవ్యాప్తంగా గుర్తింపు లేకుండా పోయిందన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం కి మారుపేరుగా నిలిచింది కానీ రాయలసీమ అంటే రతనాలసీమ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన దీని కీర్తిని దశదిశలా వ్యాపింప చేయగలిగే వ్యక్తి నిజమైన నాయకుడు అన్నారు. ప్రస్తుతం రాయలసీమలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. చెన్నై , బెంగళూరు రాయలసీమకు ఇరువైపులా ఉన్న ప్రధాన నగరాలలో రాయలసీమ వాసులే వ్యాపారాలను, రాజకీయాలను శాసిస్తున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ వ్యక్తులు బాగు పడుతున్నారు గానీ వ్యవస్థ , రాయలసీమ గడ్డ బాగుపడడం లేదన్నారు. హింసకు ఈ ప్రాంతంలో ముద్రపడింది ఆ ముద్రను చెర‌ప‌గల వ్యక్తి వ్యక్తి నాయకుడిగా రావాలన్నారు. ఆ పనిని ఒక దీక్షగా అడుగులో అడుగు వేసుకుంటూ అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలన్నారు. శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటి రాయలసీమను ఈ ప్రపంచానికి తెలియజేయడానికి త‌న‌ వంతు ప్రయత్నం చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.
బిజెపి కూడా దానికి కట్టుబడి ఉంటుందని, కట్టుబడి ఉండేలా చేయడానికి త‌న‌ వంతు కృషి చేస్తానన్నారు. తాను సన్యాసిని ఏ పార్టీతోనూ, ఏ ప్రాంతంతోనూ సంబంధం లేద‌న్నారు.. కాగా, జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటే త‌న‌ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అందులో ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేయడం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన సాగిస్తుంటే యాక్ట్ ని అమలు చేయడానికి ఎందుకు భయపడుతున్నట్లు చెప్పారు. తిరుమల వెంకన్న స్వామి వారి ఆస్తులను అమ్మడం పై గతంలో తాము ప్రతిఘటించినట్లు చెప్పారు. అప్పట్లో ఈ విషయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ కూడా చేశానన్నారు. ఆస్తుల వివరాలు క్రయ విక్రయాలు ఆభరణాలు తదితర వివరాలను గత ఇరవై ఏళ్ళ ముందు వరకు తెలపాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటివరకు ధార్మిక మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు హయాంలో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 375 దేవాలయాలు వరకు మూలన పడ్డాయని, మరికొన్ని కూలిపోయాయి అన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉందన్నారు. ప్రతి మతానికి సమాన స్వేచ్ఛను కల్పిస్తానని ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి హిందూ మతం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పడం లేదంటే అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తూ హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేయడమే కదా అన్నారు. జగన్ హిందూ కాదు పూర్తిగా క్రిస్టియన్ ఈ విషయం నిర్వివాదాంశం గా మారిందన్నారు. గత ఎన్నికలలో ప్రజలు ఆయనకు గౌరవం ఇచ్చి నమ్మకంతో అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిని చేసిందన్నారు. అన్ని మతాలను సమానంగా చూడడానికే ఆయన ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు.
ఇటీవల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వెంకటేశ్వర స్వామి తో పోల్చడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని తెలిపారు. గతంలో ఎందరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వెంకటేశ్వర స్వామి తో సమానంగా పోల్చుకోవడం తో ఏమయ్యారో మనమందరం చూసామ‌నే విషయాన్ని గుర్తు చేశారు. దేవాలయ భూములు మఠం భూములు అన్యాక్రాంతం పై ఆయన స్పందిస్తూ ఈ విషయంపై తాను గట్టి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ సిపి నాయకులు చాలా ప్రాంతాలలో బిజెపి నాయకుల పైన హింసకు దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది ఈ విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దూరంగా ఉంది కానీ బిజెపి అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలిపారు. ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలలో కూడా ఉన్నతాధికారులను ప్రభుత్వ అధికారులను విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తెలిపారు. గ‌త‌ రాత్రి కుప్పం నియోజకవర్గంలో బిజెపి జెడ్పిటిసి అభ్యర్థి పైన దాడి చేశారని ఆయన ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పారు. ఇటువంటి చర్యలకు వైయస్సార్సీపి స్వస్తి పలకాలన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు అయిపోయాయి గతంలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని, ఎన్నికలు ప్రశాంత వాతావరణాన్ని కోల్పోయాయి ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఇటువంటి అరాచకాలు అన్నింటికీ ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement