Tuesday, March 26, 2024

రేప‌టి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ – జిల్లా కలెక్టర్ హరినారాయణన్

పండగలాగా సచివాలయ ఉద్యోగులు అశావర్కర్లు చేపట్టాలి …
మున్సిపల్ కమిషనర్లు , వైద్యాధికారులు బాధ్యత తీసుకోవాలి ..
చిత్తూరు, – జిల్లాలో రేప‌టి నుండి 14వ తేది వరకు జరగబోయే కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ను పండగలాగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు . స్థానిక కలెక్టరేట్ నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమము పై జిల్లా అధికారులు , మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిoచారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుండి 14 వ తేది వరకు 4 రోజుల పాటు చేపట్టబోయే కరోన వ్యాక్సినేషన్ కార్యక్రమమును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. జిల్లాలో 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కోరోజు ఒక సచివాలయం పరిధిలో ఒక పండగలా జరిపి అక్కడ ఉన్న 45 సంవత్సరాల పై బడిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల యందలి 102 అంబులెన్స్లు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు , అలాగే పట్టణ ప్రాంతములందలి 18 అర్బన్ హెల్త్ సెంటర్లు మొత్తం కలిపి 120 ఆరోగ్య కేంద్రముల యందు ఒక్కోరోజు ఒక సచివాలయమును ఎన్నుకొని రోజుకు 120 సచివాలయముల యందు నాలుగు రోజుల పాటు మొత్తం 480 సచివాలయముల యందు 45 సంవత్సరాల పై బడిన వారందరికి నిర్దేశించబడిన రోజులలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కు సంబందించిన సచివాలయం పరిధిలోని ఏ.ఎన్.ఎం లు , ఆశలు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్న 45 సంవత్సరాల పై బడిన వారి యొక్క జాబితాను సిద్ధం చేయాలని సూచించారు . అలాగే వారికి ఏ రోజు వ్యాక్సినేషన్ ఇస్తారో ముందస్తు సమాచారం ఇవ్వాలని , అందుకు ఎం.పి.డి.ఓ లు, తాసిల్దార్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల వైద్యాధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అందరూ ఈ పండుగ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. జెడ్పీ సి.ఈ.ఓ మరియు డి.ఎం.హెచ్.ఓలు ప్రాథమిక కేంద్రముల పరిధిలో జరగబోయే వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రతి రోజు పర్యవేక్షించాలని ఆదేశించారు.
అలాగే జాయింట్ కలెక్టర్ వి. వీరబ్రహ్మం, మరియు మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ లోక వర్ధన్ కలసి మునిసిపాలిటీ పరిధిలో సచివాలయముల వ్యాక్సినేషన్ కార్యక్రమమును ప్రతి రోజు సమీక్షించుకోవాలని, ఎక్కడ ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలని , అందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి, సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వి. వీరబ్రహ్మం, డి.ఎం.హెచ్.ఓ డాక్టర్‌ పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్ డాక్టర్‌ సరళమ్మ, డి.ఐ.ఓ డాక్టర్‌ హనుమంతరావు, జెడ్పీ సి.ఈ.ఓ ప్రభాకర్ రెడ్డి, డి.పి.ఓ దశరథరామిరెడ్డి, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ లు, పి.హెచ్.సి వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement