Sunday, April 14, 2024

సీఎం జగన్ నివాసానికి సమీపంలో చెడ్డీగ్యాంగ్.. ఎమ్మెల్యే ఇంట్లో చోరీ!

ఆంధ్రప్రదేశ్ లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చోరీలకు యత్నించిన గ్యాంగ్.. తాజాగా తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలో ఉన్న నవోదయ కాలనీలోని రెయిన్‌బో విల్లాల్లో చోరీకి యత్నించారు. ఈ ఘటన ఈ నెల 3న జరిగింది. చెడ్డీగ్యాంగ్ విల్లాల్లోకి ప్రవేశించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఓ వ్యాపారికి సంబంధించిన విల్లాల్లో చోరీకి యత్నించినట్లు తెలుస్తోంది. చెడ్డీగ్యాంగ్‌కు చెందిన వారిగా భావిస్తున్న ఐదుగురు దుండగులు గడ్డపారలతో తలుపులు పగలగొట్టి 37, 39, 44 నంబరు విల్లాల్లోకి చొరబడ్డారు.

అయితే, దుండగులకు అక్కడ ఏమీ లభించకపోవడంతో వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై నిన్నటి వరకు ఎవరూ ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే, సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే నవోదయ కాలనీలోకి ముఠా ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది.

కాగా, ఇటీవల కృష్ణా జిల్లా గుంటుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి యత్నించింది. విజయవాడ, గుంటూరు పోలీసులు సమన్వయంతో చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement