Saturday, April 20, 2024

ఏపీలో 23న క్యూబా సంఘీభావ సభ.. హాజరుకానున్న చేగువేరా కుమార్తె

అమరావతి, ఆంధ్రప్రభ : సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి అమెరికా దాడులకు నిరంతరం నలిగిపోతున్న క్యూబాకు మద్దతుగా ఈ నెల 23న విజయవాడలో సంఘీభావ సభ జరుగనుంది. ఈ సభకు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనుమరాలు ఎస్తోఫేనియా గువేరా హాజరుకానున్నారు. ప్రజాస్వామిక వాదులంతా కలిసిరావాలని క్యూబా సభ నిర్వాహకులు తెలిపారు. ఇవ్వాల (శుక్రవారం) ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో క్యూబా సంఘీభావ సభ పోస్టరు విడుదల చేశారు. సభ కన్వీనర్లు సుంకర రాజేంద్రప్రసాద్‌, బుడ్డిగ జమిందార్‌లు మాట్లాడుతూ ప్రపంచంపై అమెరికా సాగిస్తున్న దుర్మార్గపు పోకడలకు వ్యతిరేకంగా గువేరా ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నారని తెలిపారు.

క్యూబాను కాపాడుకునేందుకు, అమెరికా నియంతృత్వంపై పోరాడేందుకు నిర్వహిస్తున్న పర్యటనల్లో భాగంగా క్యూబా జాతీయకమిటీ ఆహ్వానం మేరకు భారతదేశంలో ఈ నెల 4వ తేదీ నుండి పర్యటిస్తున్నారని దీనిలో భాగంగా 23వ తేదీన విజయవాడ చేరుకుంటారని తెలిపారు. ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామ్రాజ్యవాద వ్యతిరేకులు ఘనస్వాగతం పలకనున్నారని వివరించారు.

జనవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగే సభ అనంతరం తిరిగి వెళతారని తెలిపారు. వినాశకర విధానాలను అనుసరిస్తూ లాటిన్‌ అమెరికాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం సభ్యులు వై.వెంకటేశ్వరరావు, అక్కినేని వనజ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement